చేతితో లాగే రిక్షాలు వెళ్ళేందుకు మాత్రమే సరిపోయినంత స్థలం ఉండే ఉత్తర కొల్‌కతాలోని కుమార్‌టులి ఇరుకైన సందులలో, సాధారణంగా మీరు కలుసుకోగలిగే వ్యక్తులు కుమొర్‌లు (కుమ్మరులు) - నగరంలో విగ్రహాలను తయారుచేసేవారు - మాత్రమే అయుంటారు. దుర్గాదేవి, ఇంకా ఇతర దేవతల విగ్రహాలు ప్రతి సంవత్సరం ఇక్కడి నుండే కొల్‌కతా నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంటాయి.

కార్తిక్ పాల్‌కు ఇక్కడ ఒక కార్యశాల ఉంది. తన తండ్రిగారి పేరున 'బ్రజేశ్వర్ అండ్ సన్స్' అనే పేరున్న ఈ షెడ్డు వెదురుతోనూ, ప్లాస్టిక్ పట్టాలతోనూ కట్టినది. అతను మాకు దీర్ఘమైన, పొరలు పొరలుగా చేసే విగ్రహ ప్రక్రియను గురించి చెప్పారు. విగ్రహాన్ని తయారుచేసే వివిధ దశలలో గంగా మాటీ (నది ఒడ్డు నుండి సేకరించిన మట్టి), పాట్ మాటీ (జనపనార ముక్కలు, గంగా మాటీ మిశ్రమం) వంటి వివిధ మట్టి మిశ్రమాలను ఉపయోగిస్తారు.

Karthik Paul at his workshop in Kumartuli

కుమార్‌టులిలోని తన కార్యశాలలో కార్తిక్ పాల్

మా మాటలు సాగుతుండగానే కార్తిక్ తడి మట్టితో కార్తిక దేవుడి ముఖాన్ని రూపొందిస్తూ, తన నిపుణమైన చేతులతో ఆ ముఖాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన ఒక రంగులద్దే కుంచెను, వెదురును చేతితో మెరుగుపెట్టి తయారుచేసిన చియారి అనే ఒక బొమ్మలు చెక్కే పరికరాన్ని ఉపయోగిస్తున్నారు.

దగ్గరలోనే ఉన్న మరో కార్యశాలలో, ఒక మట్టి దేహనిర్మాణంపై చర్మం వంటి ఆకృతినిచ్చే ఒక సన్నని తువ్వాలు వంటి పదార్థాన్ని అంటించేందుకు గోపాల్ పాల్ జిగురును సిద్ధం చేశారు. గోపాల్ కొల్‌కతాకు ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదీయా జిల్లాలోని కృష్ణనగర్‌కు చెందినవారు. ఇక్కడి చాలామంది కార్మికులు - అందరూ పురుషులే - ఒకే జిల్లాకు చెందినవారు; చాలామంది అదే ప్రాంతంలో కార్యశాల యజమానులు ఏర్పాటుచేసిన క్వార్టర్లలో ఉంటారు. సీజన్‌ ముమ్మరమయ్యే నెలరోజులకు ముందే కూలీలను పనిలోకి తీసుకుంటారు. వారు ఎనిమిది గంటల షిఫ్టులలో పని చేస్తారు. కానీ శరత్కాల పండుగకు ముందు ఈ కళాకారులు రాత్రిపూట కూడా పని చేస్తారు, ఎక్కువ గంటలు పనిచేసినందుకు డబ్బు పొందుతారు.

కుమార్‌టులిలోని మొదటి తరం కుమ్మరులు కృష్ణనగర్ నుంచి సుమారు 300 ఏళ్ళ క్రితం వలసవచ్చినవారు. వాళ్ళు బాగ్‌బజార్ ఘాట్‌ కు సమీపంలో అప్పుడే కొత్తగా ఏర్పడుతోన్న కుమార్‌టులికి వచ్చి కొన్ని నెలలపాటు ఉన్నారు. అక్కడ ఉంటే నది నుండి మట్టిని సులభంగా తెచ్చుకోవచ్చు. వారు జమీందార్ల ఇళ్ళలో పనిచేశారు. దుర్గాపూజ పండుగకు ముందు వారాల తరబడి ఠాకుర్‌దాలాన్‌ ( జమీందార్ల నివాస ప్రాంగణంలో మతపరమైన పండుగల కోసం కేటాయించిన ప్రదేశాలు) లలో విగ్రహాలను తయారుచేశారు.

1905లో బెంగాల్ విభజన సమయంలోనూ, అంతకు ముందు కూడా బంగ్లాదేశ్‌లోని ఢాకా, బిక్రమ్‌పూర్, ఫరీద్‌పూర్‌ల నుండి నిపుణులైన కళాకారులు కుమార్‌టులికి వచ్చేవారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక జమీందారీ వ్యవస్థ క్షీణించిపోవటంతో, సర్బొజనీన లేదా సాముదాయక పూజ ప్రాచుర్యం పొందింది. ఇదంతా దుర్గామాత ఇరుకైన ఠాకూర్‌దాలన్ల నుంచి బయటకు వచ్చి, ఆమెతో పాటు ఇతర దేవతలకు కూడా విస్తృతమైన, విభిన్నమైన నేపథ్యాలను సృష్టించి వీధుల్లో ఏర్పాటుచేసిన విశాలమైన పండాళ్ళ లోకి వచ్చినప్పుడు జరిగింది.

వీడియో చూడండి: కుమార్‌టులి గుండా ప్రయాణం

పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ అతి పెద్ద పండుగ. ఇది మహాలయ నాడు, సాధారణంగా సెప్టెంబర్ మాసపు చివరలో లేదా అక్టోబర్ ప్రారంభంలో, మొదలవుతుంది. ఆ రోజున గంగానది (స్థానికంగా హూగ్లీ అని పిలుస్తారు) ఒడ్డున వేలాదిమంది తమ పూర్వీకులకు తర్పణాలు వదిలే ఆచారాన్ని పాటిస్తారు. చతుర్థి, పంచమి లేదా షష్ఠి రోజులలో దేవతను ప్రతిష్టిస్తారు. ప్రధాన పూజ మూడు రోజులపాటు - మహా సప్తమి, మహా అష్టమి, మహా నబ(వ)మి - కొనసాగుతుంది. పూజాసంస్కారాలు చాలా దీర్ఘంగానూ, సవిస్తరంగానూ జరుగుతాయి. ఈ మూడు రోజుల తర్వాత, దశమి (చివరి రోజు)నాడు అనేకమంది కొల్‌కతావాసులు విగ్రహాలను హూగ్లీ నదిపైనున్న బాబూఘాట్ తదితర ఘాట్ల వద్ద నిమజ్జనం చేసి దేవతకు ఒక భావోద్వేగపూరితమైన వీడ్కోలు పలుకుతారు.

ఇక్కడ కుమార్‌టులిలో ఉన్న ఈ కార్యశాలలో  విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతోన్న కార్తిక్, తనూ తన కార్మికులు సొంతంగా రంగులు తయారుచేసుకుంటామని మాతో చెప్పారు. వాళ్ళు ఖొరి మాటీ (సముద్రపు నురగతో తయారుచేసే ఒక ప్రత్యేకమైన మట్టి)ని రంగుల రసాయనాలతోనూ, కాఁయి-బిచి లేదా చింత గింజలతో తయారైన జిగురుతోనూ కలుపుతారు. చింతగింజల పొడి మట్టి నమూనాలపై రంగులను చాలాకాలం పాటు నిలిచివుండేలా చేస్తుంది.

కాసేపటికి మొత్తంగా అలంకరించిన విగ్రహాలు నగరంలోకి ప్రవేశించే ప్రయాణానికి సిద్ధమయ్యాయి. మసక వెలుగులతో ఉండే కుమార్‌టులి స్టూడియోలు తమ కళాకృతులకు త్వరలో వీడ్కోలు చెప్పనున్నాయి. ఆ కళాకృతులు కొల్‌కతాలోని ప్రకాశవంతంగా కాంతులు చిమ్మే తమ కొత్త నివాసాలైన పండాళ్ళ లో కొలువుతీరనున్నాయి.

The artisans prepare a clay called ‘path mati’ by mixing jute particles with ‘atel mati’ from the Ganga

గంగానది నుంచి తెచ్చిన 'ఎఁటెల్ మాటీ'తో జనపనార ముక్కలను కలిపి 'పాట్ మాటీ' అనే మట్టిని కళాకారులు తయారుచేస్తారు

Once the bamboo structure is ready, straw is methodically bound together to give shape to an idol; the raw materials for this come from the nearby Bagbazar market

ఎడమ: విగ్రహానికి ఆధారంగా ఉండేలా ‘కఠమొ’ అనే వెదురు నిర్మాణాన్ని తయారుచేయటంతో విగ్రహాన్ని తయారుచేసే ప్రక్రియ మొదలవుతుంది. కుడి: వెదురు నిర్మాణం సిద్ధమయ్యాక, విగ్రహానికి ఆకృతినివ్వడానికి ఒక పద్ధతి ప్రకారం గడ్డితో చుడతారు; ఇందుకు కావలసిన ముడి పదార్థాలన్నీ దగ్గరలోని బాగ్‌బజార్ మార్కెట్ నుంచి వస్తాయి

An artisan applies sticky black clay on the straw structure to give the idol its final shape; the clay structure is then put out in the sun to dry for 3 to 4 days

గడ్డి నిర్మాణానికి చివరి రూపాన్నివ్వడానికి నల్లటి బంకమన్నును పూస్తోన్న ఒక కళాకారుడు; ఇప్పుడు ఈ మట్టి నిర్మాణాన్ని ఎండటానికి 3 నుండి 4 రోజుల పాటు ఎండలో పెడతారు

ఆకృతి రూపకల్పనకు ఒక రంగులద్దే కుంచె, వెదురును సానపెట్టి చేసిన ఉపకరణం అవసరం

At another workshop nearby, Gopal Paul uses a fine towel-like material to give idols a skin-textured look

సమీపంలోని మరో కార్యశాలలో, విగ్రహానికి చర్మంలా కనిపించేలా చేయడానికి గోపాల్ పాల్, ఒక సన్నని తువ్వాలు వంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు

Half painted Idol of Durga

మహాలయ శుభదినాన దుర్గాదేవి కన్నుల చిత్రీకరణతో, మట్టి విగ్రహాలు ప్రాణం పోసుకుంటాయి

చూడండి: ‘కుమార్‌టులి గుండా ప్రయాణం’ ఫోటో ఆల్బమ్

ఈ వీడియో, కథనం సించిత మాజీ 2015-2016 PARI ఫెలోషిప్‌లో భాగంగా చిత్రీకరించినవి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sinchita Parbat

Sinchita Parbat is a Senior Video Editor at the People’s Archive of Rural India, and a freelance photographer and documentary filmmaker. Her earlier stories were under the byline Sinchita Maji.

Other stories by Sinchita Parbat
Text Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli